భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?

లద్దాఖ్ సరిహద్దుల్లో ఘర్షణల నడుమ గత ఐదు నెలలుగా భారత్, చైనా తమ సైనిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి.
క్షిపణి పరీక్షలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్య వ్యవస్థలనూ పటిష్ఠం చేసుకుంటున్నాయి. మరోవైపు అమెరికా, భారత్, జపాన్ ఆస్ట్రేలియా కలిసి ‘‘క్వాడ్’’ విన్యాసాలూ చేపట్టాయి.
ఆస్ట్రేలియాను తన నావికా దళ విన్యాసాల్లో చేర్చుకోవడం ద్వారా చైనాకు గట్టి సందేశం పంపించాలని భారత్ భావించింది. ఇదివరకు ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ మాత్రమే పాల్గొనేవి.
చైనా అభ్యంతరాల నడుమ ఈ విన్యాసాలకు ఆస్ట్రేలియాను భారత్ దూరంగా పెడుతూ వచ్చింది.
మరోవైపు శీతాకాలంలో లద్దాఖ్లో అనుసరించే వ్యూహాలకూ భారత్ పదును పెడుతోంది. సైనికులకు చలిని తట్టుకునే వస్త్రాలు అందించడం, ఆయుధాలను సిద్ధం చేయడం లాంటి చర్యలను ఇప్పటికే మొదలుపెట్టింది.
ఈ విషయంలో చైనా కూడా అసలు ఏ మాత్రమూ తగ్గడం లేదు. సరిహద్దుల వెంబడి తమ బలగాలు, ఆయుధ సంపత్తిని పెంచుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. హిమాలయాల్లో మోహరించిన సైనికుల కోసం ఎప్పటికప్పుడు వేడి ఆహారం, వస్త్రాలు అందించేందుకు ఏర్పాట్లు కూడా చైనా చేస్తోంది.
అయితే, నవంబర్ 6న చుశూల్లో కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఎనిమిది రౌండ్ల చర్చల తరువాత ఇరు పక్షాలు సైనిక ఉపసంహరణ విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఎల్ఏసీ వద్ద భారత్, చైనాలు తమ సైన్యాలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తే, లద్దాఖ్ ప్రాంతంలో గత ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంటుంది.
“ఘర్షణాత్మక ప్రాంతాలలో సైనిక ఉపసంహరణ దశల వారీగా ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది” అని భారత సైనిక వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ పేర్కొంది.
రెండు దేశాల బలగాలు మళ్లీ ఢీ అంటే ఢీ అంటూ ఎదురుపడే సంకేతాలేమీ కనిపించడంలేదు. కానీ, సుదీర్ఘకాలం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి.
భారత్లో క్షిపణుల అభివృద్ధి, పరీక్షలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం.. పరీక్షలు జరుగుతున్నట్లు అనిపించడంలేదు. సెప్టెంబరు, అక్టోబరుల్లో భారత్ 13 క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇంత తక్కువ సమయంలో ఇన్ని పరీక్షలు నిర్వహించడం అసాధారణమని అక్టోబరు 29న ఇంగ్లిష్ పత్రిక హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనాతో ఘర్షణల నడుమ ‘‘భారత్లో తయారీ’’ కార్యక్రమం కింద సంప్రదాయ, అణు క్షిపణుల తయారీ వేగం పుంజుకుందని ఆ పత్రిక పేర్కొంది. సగటున ప్రతి నాలుగు రోజులకు ఒక క్షిపణిని భారత్ ప్రయోగించినట్లు వివరించింది.
మరోవైపు క్షిపణి పరీక్షలను వేగవంతం చేయాలని భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్డీవో)కు భారత ప్రభుత్వం సూచించినట్లు కూడా హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ చైనా తీరును దృష్టిలో ఉంచుకుని డీఆర్డీవోను భారత్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థలను పరీక్షించినట్లు ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ పేర్కొంది. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమన్స్ట్రేటర్ వెహికల్ (హెచ్ఎస్టీడీవీ), మానవరహిత స్క్రామ్జెట్ డెమో ఎయిర్క్రాఫ్ట్, హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్), లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్, పృథ్వీ-2 బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్, న్యూక్లియర్ కేపబిలిటీ హైపర్సోనిక్ గాలంటరీ మిసైల్, ద సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీస్ ఆఫ్ టార్పిడో(ఎస్ఎంఏఆర్టీ) వ్యవస్థ, భారత తొలి స్వదేశీ యాంటీ రేడియేషన్ మిసైల్, స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్ (ఎస్ఏఎన్టీ) తదితర క్షిపణుల పరీక్షలను భారత్ నిర్వహించింది.
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ వ్యవస్థను నవంబరు 4న భారత్ పరీక్షించింది. ఇది 45 నుంచి 60 కి.మీ. దూరంలోని లక్షాలపై గురిపెట్టగలదు. ముఖ్యంగా చైనా సైన్యం, ఆయుధ సంపత్తే లక్ష్యంగా ఈ క్షిపణిని తయారుచేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
‘‘5 ఐ’’ నిఘా కూటమిలో భారత్ చేరుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లను ‘‘5 ఐ’’ దేశాలుగా పేర్కొంటారు.
‘‘అమెరికా నేతృత్వంలో చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటైన నిఘా కూటమిలో భారత్ కూడా చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి’’అని భద్రతా వ్యవహారాల నిపుణుడు, ఈటీవీ ఇండియా నెట్వర్క్కు చెందిన సంజీవ్ కుమార్ బారువా పేర్కొన్నారు.
వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు సంబంధించి సమాచారాన్ని పంచుకోవడంపై అక్టోబరు 11న 5ఐ దేశాలతో కలిసి జపాన్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సండే గార్డియన్ పత్రికలో దీనిపై ఒక వార్త కూడా ప్రచురితమైంది. ‘‘భారత్తో సమాచారం పంచుకునేందుకు కూటమి అంగీకరించింది. భారత్ కూడా ఇప్పుడు దీనిలో భాగమే’’అని వార్తలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక ‘‘ద ఆస్ట్రేలియన్’’ కూడా ఒక వార్త ప్రచురించింది. అక్టోబరులో జరిగిన 5 ఐ మీటింగ్లో భారత్, జపాన్ కూడా పాలుపంచుకున్నట్లు తెలిపింది. ఈ కూటమిలోకి భారత్ను తీసుకువచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వివరించింది.
పెరిగిన క్వాడ్ కార్యకలాపాలు
చైనాతో ఘర్షణల నడుమ అక్టోబరు 5న టోక్యోలో జరిగిన ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్)లో భారత్ పాలుపంచుకుంది. మరోవైపు అక్టోబరు 19న మలబార్ నావికా దళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాలుపంచుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.
చైనా దూకుడును దృష్టిలో ఉంచుకునే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని చాలా మంది భద్రతా నిపుణులు భావిస్తున్నారు.
భారత్ చర్యలను చైనాకు గట్టి జవాబుగా సైనిక నిపుణుడు అజయ్ శుక్లా వ్యాఖ్యానించారు. ‘‘చైనాకు బుద్ధి చెప్పేందుకే.. మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు భారత్ చోటు కల్పించింది’’అని ఆయన ట్వీట్ చేశారు.
‘‘చైనాను అమెరికా నేరుగా విమర్శించింది. చైనా దూకుడుకు బాధితులుగా మారినప్పటికీ భారత్ సరిగా స్పందించలేదు’’అని ఆయన ట్వీట్ చేశారు.